12వ తేదీలోగా బండి మంత్రి పదవి తేలే అవకాశం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ను కేంద్ర మంత్రి పదవి వరించేది, లేనిది తేలడానికి మరో వారం పట్టే అవకాశం ఉన్నది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రాజధానిలో లేకపోవడం, ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనకు తెలంగాణకు రానున్న నేపథ్యం కారణంగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఆలస్యం కానున్నది. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు పూనుకున్నది. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ను మార్చి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది.రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంజయ్ సేవలను వినియోగించుకోవడానికి కేంద్ర నాయకత్వం ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించడమో లేక జాతీయ కార్యదర్శిగా నియమించి కొన్ని రాష్ర్టాలకు బాధ్యులుగా పంపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఒకే వ్యక్తికి ఒకే పదవి అన్న కారణంతో కేంద్ర మంత్రి పదవికి కిషన్రెడ్డి రాజీనామా చేయాల్సి ఉన్నది. ఆయన రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఆయన స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్ కుమార్కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారని తెలుస్తున్నది. గత మంత్రి వర్గ కూర్పు సమయంలోనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గిరిజనులకు ప్రాధాన్యం కల్పించినట్లవుతుందని, ఆయా వర్గాల్లో పార్టీని మరింత బలంగా తీసుకు వెళ్లేందుకు వీలు కలుగుతుందని భావించారు. అప్పటి సమీకరణాల కారణంగా అది వీలు కాకపోవడంతో ఇప్పుడు ఆయన పేరు బలంగా వినవస్తున్నది.రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన సంజయ్ తాను సామాన్య కార్యకర్తగానే ఉంటానని ప్రకటించడం పార్టీ నాయకత్వంపై కినుకతోనేనని భావిస్తున్నారు. ఆయనలో అసంతృప్తిని తొలగించి గతంలో మాదిరిగానే చురుకుగా వ్యవహరించేందుకు మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. రాష్ర్టానికి రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. పార్టీలో జాతీయ కార్యదర్శి హోదాకు మంచి ప్రాధాన్యం ఉన్నా సొంత రాష్ట్రంలో క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం లేనందువల్ల సంజయ్ ఆ పదవి పట్ల సుముఖంగా లేరని అందుకే కేంద్ర నాయకత్వం మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ జిల్లాలో పర్యటించి బహిరంగ సభలో పాల్గొననున్నారు. 9న హైదరాబాద్లో జరిగే దక్షిణాది రాష్ర్టాల బీజేపీ అధ్యక్షులు, మంత్రులు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవస్థాగత అంశాలపై, తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తారని సమాచారం. ఆయన 9న రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ సమయానికి రాష్ర్టాల పర్యటనలు ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని తిరిగి ఈ నెల 13న విదేశీ పర్యటనకు వెళ్లనున్నందున 10 నుంచి 12వ తేదీలోగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని భావిస్తున్నారు. ఈ మంత్రివర్గ కూర్పులోనే సంజయ్ భవితవ్యం తేలుతుంది.సంజయ్కి మంత్రి పదవి లభిస్తే ఒకే విడతలో మూడు ఉన్నత స్థాయి పదవులు అలంకరించిన వ్యక్తిగా మారనున్నారు. 2019లో కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన ఆయన కొంత కాలానికే రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కితే ఐదేళ్ల వ్యవధిలో మూడు క్రియాశీల పదవులను నిర్వహించిన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్రెడ్డి, బండి సంజయ్ ఢిల్లీ నుంచి బయల్దేరి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. గురు, శుక్రవారాల్లో వరంగల్లో మకాం వేసి ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.