బీఆర్ఎస్ను పాతరేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం
- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.”పొత్తులు, ఒప్పందాలు కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాత్రమే చేసుకుంటాయి. బీజేపీపై తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం. బీఆర్ఎస్ను పాతరేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో దేశంలో అధికారం పంచుకున్న చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్దే. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే. ఆ రెండు పార్టీల టీఎన్ఏ ఒక్కటే. భవిష్యత్లో బీఆర్ఎస్తో కలసే ప్రసక్తే లేదు. వారి సహకారం మాకు అవసరం లేదు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి తీరుతాం. ఒక్క కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయింది.” అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.”దళిత ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూం ఇళ్ళు సహా.. నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుకూలంగా బీజేపీ పరిపాలన ఉంటోంది. లక్ష్మణ్, బండి సంజయ్ నాయకత్వంలో మంచి ఫలితాలను సాంధించాం. ప్రజాస్వామ్య పద్దతిలో బీఆర్ఎస్ను పాతరేయటానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయటంలో కేసీఆర్ విఫలం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలం ఉంటోంది కానీ.. పేదలకు ఇవ్వటానికి స్థలం లేదా?. పాతబస్తీ ఫలక్నామా వరకు మెట్రోను ఎందుకు పొడిగించలేదో కేసీఆర్ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వలనే అనేక రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఎస్సీ విద్యార్ధులకు కేంద్రం స్కాలర్షిప్లు ఇస్తామంటే కేసీఆర్ సర్కార్ అడ్డుకుంది. దశాబ్ది ఉత్సవాలు కేసీఆర్ కుటుంబానికి మాత్రమే. వరంగల్లో ప్రధాన మంత్రి మోదీ పర్యటనను విజయవంతం చేయాలి.” అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.