ఒడిశా రైలు ప్రమాదం పై సిబిఐ దర్యాప్తులో కీలక పరిణామం
.. ముగ్గురు ఇండియన్ రైల్వే ఉద్యోగుల అరెస్ట్
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఏకంగా 293 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కుట్రకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రమాదంతో సంబంధమున్న ముగ్గురు ఇండియన్ రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసింది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్(సిగ్నల్) అరుణ్ కుమార్ మెహతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్లను అదుపులోకి తీసుకుంది. హత్యకు సమానం కాని శిక్షించదగిన నేరం, ఆధారాల చెరిపివేత కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొంది. వీరి ముగ్గురి చర్యలే ప్రమాదానికి దారితీశాయని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఉద్దేశ్యపూర్వకం కాకపోయినప్పటికీ వారి చర్యలు విషాదానికి దారితీస్తాయని వారికి తెలుసని తెలిపాయి. కాగా ఉద్దేశ్యపూర్వకంగా చేసి ఉంటే హత్యానేరం కింద కేసు పెట్టి ఉండేవారు.కాగా రైల్వేస్ సేఫ్టీ కమిషనర్ గతవారమే కీలక ప్రకటన చేశారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని తేల్చేశారు. సిగ్నలింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వర్కర్లే ఇందుకు కారణమని చెప్పిన విషయం తెలిసిందే.