చిప్పకూడు తిన్న దొంగను ఆంధ్రకు ముఖ్యమంత్రి చేశాం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బస్సు యాత్రలో పాల్గొన్న అశోక్గజపతిరాజు జగన్ గురించి ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”చంచల్ గూడ జైలు నుంచి ఉత్తర కోస్తా జిల్లాలకు జగన్ రెడ్డి ట్రాన్సఫర్ పెట్టుకున్నారట.!. జైల్లో చిప్ప కూడున్న తిన్న దొంగను మనం ఆంధ్రాకు ముఖ్యమంత్రిని చేసేశాం. అభివృద్ధి చేసేశాం అని చెబుతున్న వైసీపీ నేతల చేష్టలు ఏంటో మనకు తెలియవా.!” అని అశోక్గజపతిరాజు విమర్శించారు.ఆర్థిక నేరాలకు పాల్పడి, పదహారు నెలలు జైల్లో మగ్గిన దొంగను ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజలంతా నేడు నరకాన్ని చూస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్ అంటూ తండ్రి ఫొటోను అడ్డం పెట్టుకుని వచ్చిన ఆయన నేడు అన్నివర్గాల ప్రజలకు నరకం చూపిస్తున్నారని అన్నారు. భవిష్యత్కు గ్యారెంటీ బస్సుయాత్ర తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ సారధ్యంలో రాజాంలో శుక్రవారం మొదలైంది. కార్యక్రమంలో అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా నిప్పులు చెరిగారు.బెయిల్పై చంచల్గుడా జైలు నుంచి వచ్చిన ఆయన తిరిగి విశాఖ జైలుకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్రెడ్డి మోదీ కాళ్లముందు మెడలు వంచడం ద్వారా తెలుగుజాతి గౌరవాన్ని మంటకలుపుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే ధైర్యం ఆయనతో పాటు మంత్రులకూ లేదన్నారు. కేసులకు భయపడొద్దని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ధైర్యాన్నిచ్చారు.