తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో కేంద్ర సర్కార్ జాప్యం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం కింద ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కానీ రాష్ట్రంలోని వేలాది మంది గిరిజన యువత ఉన్నత విద్యా అవకాశాలును కోల్పోతున్నట్లు మంత్రి కేటీఆర్ విమర్శించారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఆరేళ్ల క్రితమే ములుగులో 350 ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పగించినట్లు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో దారుణంగా విఫలమైందన్నారు. కీలకమైన ఆ ఇన్స్టిట్యూషన్ కోసం కేంద్రం నిధులను విడుదల చేయడం లేదన్నారు. ఎన్నో సార్లు సీఎం కేసీఆర్ కేంద్రాన్ని వినతిపత్రాలు సమర్పించారని, కానీ కేంద్ర పాలకులు ఆ విన్నపాలను విస్మరించినట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు.గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమను వీడాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ పర్యటన సందర్భంగా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.