‘‘నేను కొట్టినట్లు చేస్తా..నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’’
- కేసీఆర్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీరు పై పొంగులేటి సెటైర్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో హస్తం పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల చేరికకు సంబంధించి పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారని, ఈ వ్యవహారాన్ని వాళ్లే చూసుకుంటారని తేల్చిచెప్పారు. ఏపీ వెళ్లి సీఎంవో అధికారులను మాత్రమే కలిశానని, సీఎం జగన్ను తాను కలవలేదని వివరణ ఇచ్చారు. తన సంస్థకు చెందిన కాంట్రాక్ట్ సంబంధించిన అంశాలు అధికారులతో చర్చించానన్నారు. షర్మిల టాపిక్ ఏమాత్రం చర్చించలేదని, వైఎస్ఆర్సీపీ పార్టీని తెలంగాణలో జగన్ వద్దనుకున్నారన్నారని వెల్లడించారు. సోమవారం సీఎల్పీ నేత భట్టి నివాసానికి వెళ్లిన పొంగులేటి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తమ జిల్లా నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలవాలని వచ్చామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై భట్టితో చర్చించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనను బంగాళాఖాతంలో కలపడంపై చర్చించామన్నారు. కేసీఆర్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీరు ‘‘నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’’ అన్నట్లుగా ఉందంటూ సెటైర్ విసిరారు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలు ఉన్నాయని.. అవి ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, రెండు వ్యతిరేక వర్గం అని చెప్పుకొచ్చారు. ప్రజలు ఈసారి కేసీఆర్ను ఇంటికి పంపాలని బలంగా డిసైడ్ అయి ఉన్నారన్నారు.