వలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ కామెంట్స్పై రాష్ట్రంలో రచ్చ రచ్చ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్పై రాష్ట్రంలో రచ్చ రచ్చ అవుతోంది. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ నిరసనలు, ఆందోళనలు, దిష్టిబొమ్మలు దగ్దం చేస్తూ వైసీపీ కార్యకర్తలు, వలంటీర్లు రోడ్డుపైకొచ్చారు. అంతేకాదు ఏపీ మహిళా కమిషన్ కూడా సేనానికి నోటీసులిచ్చింది. పది రోజులు పవన్ చేసిన వ్యాఖ్యలపై స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ వివాదం ఈ రేంజ్లో నడుస్తుండగానే అదే ఏలూరులోనే పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థపై సోమవారం నాడు పవన్ సుదీర్ఘంగా మాట్లాడారు.‘వలంటీర్ వ్యవస్థ చాలా భయంకరమైన వ్యవస్థ. వలంటీర్లకు 5 వేలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశమిచ్చారు. ప్రతి ఇంటి డేటా అంతా వలంటీర్లకి తెలుసు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అంతా వాళ్లకి తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్దేశం మరోలా ఉండవచ్చు.. సెన్సిటీవ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే ఎలా?. వలంటీర్ల వ్యవస్థ పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలి. దానికి మనం వ్యతిరేకం కాదు.. కానీ ప్రభుత్వానికి మద్ధతుగా పనిచేస్తే అంగీకరించవద్దు.. ఏమీ భయపడొద్దు. రేషన్ డిపోల వ్యవస్థకు సమాంతరంగా మొబైల్ డిపోల వ్యవస్థ తీసుకువచ్చారు. ఎప్పుడైనా సీఎం వైఎస్ జగన్ (ఈ వ్యవస్థను పరిశీలించారా..?. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రతగా ఉండాలి. మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా..? లేదా..? చూసుకోవాలి. ఒంటరి, వితంతు, భర్తలతో విడిపోయి ఉంటున్న మహిళలు జాగ్రతగా..? ఉన్నారా.. లేదా..? అనేది గ్రామాల్లో ఉండే జనసేన వీర మహిళలు ఒక కంటితో గమనించాలి. దెందులూరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం మనం ప్రారంభిద్దాం. ప్రతీ రాజకీయ మద్ధతుదారుడు మహిళల భద్రతపై దృష్టిపెట్టాలి. వలంటీర్లు వైసీపీకి పనిచేస్తున్నారో లేదో దృష్టిపెట్టాలి. వలంటీర్లకు అవసరమైన సమాచారం మాత్రమే ఇవ్వండి.. అనవసరంగా సమాచారం ఇవ్వవద్దు. సమాంతర రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ ఉండడానికే జగన్ ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. ఇదంతా ప్రజలను నియంత్రించడానికే.. వలంటీర్ల వ్యవస్థను సరిగ్గా చూడకపోతే, భవిష్యత్తులో అది ఒక ఐఏఎస్ వ్యవస్థలా అవుతుంది. పులివెందుల ఒకప్పుడు సరస్వతి నిలయం. అటువంటి దానిని ఫ్యాక్షన్ నిలయంగా మార్చారు. ఫ్యాక్షన్ సంస్కృతిని మార్చి పులివెందులను మళ్లీ సరస్వతి నిలయంగా మార్చుదాం’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఏపీలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర ఎన్సిఆర్బి చెబుతోంది. వారిలో సగం మంది మాత్రమే ఇంటికి వచ్చారు. మిగతా వారు ఏమయ్యారు..?. దానిపై కేంద్రం లోతుగా అధ్యయనం చేస్తున్నది. ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో పని చేసే యువకులకు ఇళ్లు ఇవ్వమని అక్కడ వారు చెప్పారు. అంతా జాగ్రత్తగా ఉంటాం.. ఇదంతా మన భద్రత కోసమే చేస్తాం. అటువంటిది పదిమంది వలంటీర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. అది ప్రతీ ఇంటి డేటా కోసమే. వలంటీర్ల వ్యవస్థలో మహిళల ప్రాతినిత్యం తక్కువ ఉందనిపిస్తుంది. ఈ వ్యవస్థ ప్రతి ఇంటికి సంబంధించిన సమాచారాన్ని సూక్ష్మ స్థాయిలో సేకరించే పరిస్థితికి వెళ్లిపోయింది. వారు సేకరించే సమాచారం అంతా చాలా సున్నితమైన సమాచారం. ఆ సమాచారం అంతా ఏమవుతుంది.. ఎక్కడికి వెళుతుంది.. ఇది చాలా భయంకరమైన అంశం. అందరి వలంటీర్ల గురించి అనడం లేదు. ఇదంతా ప్రజల్ని నియంత్రించడానికే. ఇతర వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ సమాంతర వ్యవస్థ ఎందుకు..?. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని అధికారులు అంటున్నారు. మరి సేకరించిన డేటా అంతా ఏమవుతోంది..?. వలంటీర్లకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీల దగ్గర సమాచారం ఉండాలి. వాట్సాప్ గ్రూపుల ద్వారా వారిని కలెక్టర్లు, ఎస్పీలకు అనుసంధానం చేయాలి. అప్పుడే తప్పు చేసిన వారిపై చర్య తీసుకోవడం వీలవుతుంది’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు పవన్ చేసిన వ్యాఖ్యలపైనే నానా రచ్చ జరుగుతుంటే.. తాజా వ్యాఖ్యలతో ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందో.. వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.