రైతుల పాదయాత్ర లో వైసీపీ కార్యకర్త వీరంగం
తెలంగాణజ్యోతి / వెబ్ న్యూస్ : అమరావతి రాజధాని సాధన కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. బుధవారం 31వ రోజు కొనసాగుతోంది. ఇవాళ తణుకు మండలం, వేల్పూరు నుంచి పాదయాత్ర సాగుతోంది. తణుకు నియోజకవర్గం నుంచి నిడదవోలు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. అమరావతి పాదయాత్ర హోరెత్తింది. జోరువానలోనూ రైతులు జై అమరావతి అంటూ నినదించారు. వందలాది మంది రైతులు, స్థానికులు వారితో కలసి అడుగులో అడుగు వేశారు. వర్షం అవరోధం సృష్టించినా… అధికార పార్టీ కవ్వింపులకు పాల్పడినా ఒకే ధ్యేయంతో పాదయాత్ర ముందుకు సాగింది. రైతుల పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ నుంచి తణుకు నియోజకవర్గం వేల్పూరు వరకు మంగళవారం 30వ రోజు 15 కిలోమీటర్ల యాత్ర సాగింది. రైతుల పాదయాత్ర లో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. తణుకు మండలం వేల్పూరులో పాదయాత్ర జరుగుతున్న సమయంలో నల్ల జెండా ఊపి నిరసన తెలిపేందుకు వైసీపీ కార్యకర్త ప్రయత్నించాడు. దీంతో పాదయాత్ర చేస్తున్న కొందరు రైతులు ఆయనకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. దండం పెడుతూ వైసీపీ కార్యకర్తను ఆపేందుకు అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తరువాత వివాదం సద్దుమణిగింది.కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో నేటితో పాదయాత్ర ముగియనుంది. ఈరోజు వేల్పూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర వీ రభద్రపురం, మండపాక, పైడిపర్రులో భోజన విరామం అనంతరం తణుకు చేరుకుంటుంది. పట్టణంలోని ఆర్వోబీ, వేంకటేశ్వర సెంటర్, నరేంద్ర సెంటర్, కేశవస్వామి గుడి సెంటర్, ఉండ్రాజవరం జంక్షన్, ఉండ్రాజవరం రోడ్డులోని పాలంగి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించి ఉండ్రాజవరం వద్ద ముగుస్తుంది. వీరికి రాత్రి బస కానూరులోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు.