అమ్మో కిలాడి లేడి 8 మందితో ప్రేమ వివాహం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సామాజిక మాధ్యమాల ఆధారంగా తన అందచందాలను విస్త్రతంగా ప్రచారం చేసుకున్న ఓ యువతి… ధనవంతుల బిడ్డల్ని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపింది… ఆనక వారిని పెళ్లి చేసుకుని మూడు నాలుగు నెలల పాటు కాపురం చేసి, వారి ఇంట్లో వున్న నగలు, నగదుతో ఉడాయించేది.. ఇలా మొత్తం ఎనిమిదిమందిని వివాహం చేసుకున్న ఓ యువతి గుట్టు.. చివరగా భర్త అయిన వడ్డీ వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో రట్టయింది. పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి… సేలం జిల్లాకు చెందిన బ్యూటీషియన్ రషీదా వివిధ పేర్లతో ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు తెరచి, ధనవంతులైన యువకులతో చాటింగ్ జరిపేది. ఆమె ఛాటింగ్కు, అందాలకు యువకులు ముగ్ధులయ్యేవారు. ఆ తర్వాత రషీదా ప్రేమ పేరుతో వారిని ముగ్గులోకి దింపేది. అనంతరం పెళ్లి చేసుకుని, వారి ఇళ్లకు వెళ్లిన రషీదా.. మూడు నాలుగు నెలల్లో వారి గుట్టంతా తెలుసుకుని వారి నగలు, నగదుతో ఉడాయించేది. ఎం. చెట్టిపట్టికి చెందిన మూర్తి (30) అనే ఫైనాన్స్ కంపెనీ యజమానిని తాజాగా రషీదా బుట్టులో వేసుకుంది. మార్చి 30న ఓమలూరు శివాలయంలో ఇరువురూ రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు. మూడు నెలలు అతడితో కాపురం చేసిన రషీదా ఈనెల 5వ తేదీన ఇంట్లో వున్న లక్షలాది రూపాయల విలువ చేసే నగలు, నగదుతో మాయమైపోయింది. ఈ విషయమైన మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జరిపిన విచారణలో రషీదాను పెళ్ళి చేసుకోవడం కోసం మూర్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడని తేలింది. ఇదే విధంగా తుడియలూరు మహిళా పోలీసుస్టేషన్ లోనూ రషీదాపై సత్యగణేష్ అనే యువకుడి భార్య ఫిర్యాదు చేసింది. తన భర్తను ప్రేమ వివాహం చేసుకున్న రషీదా నగలు, నగదు దోచుకెళ్ళిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరపగా, రషీదా ధనవంతులైన మరో ఆరుగురు యువకులను కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుని నగలు, నగదుతో ఉడాయించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రషీదా కోసం సేలం పోలీసులు గాలిస్తున్నారు.