ఢిల్లీలో డేంజర్ మార్క్ దాటిన యమునానది
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు చోట్ల వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ లో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. డేంజర్ మార్క్ ను దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మొన్నటి వరకూ యమున ఉప్పొంగడంతో జరిగిన నష్టం నుంచి కోలుకోకముందే మరోసారి యమునమ్మ ఉగ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది.ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునా నది మరోసారి ఉప్పొంగుతోందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం డేంజర్ మార్క్ ను దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.కాగా, గత వారం యమునమ్మ ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. నది నీటిమట్టం ఆల్ టైం గరిష్ఠానికి చేరి 208.66 మీటర్లకు చేరింది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, మంత్రుల ఇళ్లు, రాజ్ భవన్, ఎర్రకోట, దేశ అత్యున్నత న్యాయ స్థానం సహా పలు ప్రాంతాల్లో వరద నీరు మోకాళ్ల లోతుకు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో యమునమ్మ కాస్త శాంతించింది. తాజాగా మరోసారి ప్రమాదకరస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.