క్రమంగా కుంగిపోతున్న షికాగో నగరం
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: అమెరికాలో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన షికాగో క్రమంగా కుంగుతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. భూగర్భ పర్యావరణ మార్పులే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిణామాన్ని ‘సబ్సర్ఫేస్ హీట్ ఐలాండ్స్’ అని అంటారని, భవనాల నుంచి విడుదలయ్యే వేడి, సబ్వే వంటి భూగర్భ రవాణా వ్యవస్థల కారణంగా ఇది జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణాల్లో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూమిలో మార్పులకు కారణమవుతున్నాయని, భవనాలు, ఇతర ఇన్ఫ్రాస్ర్టక్చర్పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. నగరం ఎంత కిక్కిరిసి ఉంటే, అంత ఎక్కువగా భూగర్భం పర్యావరణ మార్పులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని ఇల్లినాయిస్లోని నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అలెగ్జాండ్రో రోటా లోరియా తెలిపారు.షికాగో లూప్ జిల్లాలో పరిశోధకులు భూమిపైన, భూగర్భంలోనూ 150 టెంపరేచర్ సెన్సార్లను అమర్చారు. బేస్మెంట్స్, టన్నెల్స్, పార్కింగ్ గ్యారేజ్ వంటి భిన్న ప్రదేశాల్లో వీటిని అమర్చారు. నిర్మాణాలు, రవాణా కారణంగా ఎలాంటి అధిక వేడి వెలువడని, ఎలాంటి నిర్మాణాలు లేని గ్రాంట్ పార్క్ ప్రాంతంలోనూ ఈ సెన్సర్లను బిగించారు. మూడేండ్లపాటు డాటాను సేకరించారు. గ్రాంట్ పార్క్ కంటే లూప్ జిల్లా అండర్గ్రౌండ్ టెంపరేచర్ 10 డిగ్రీలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఇది భూగర్భంలో మార్పులకు కారణమవుతున్నదని పరిశోధకులు తెలిపారు. కాగా, జనాభా పరంగా అతిపెద్ద నగరమైన న్యూయార్క్ కూడా కుంగుతున్నదని పరిశోధకులు ఇదివరకే వెల్లడించారు. 20 ఏండ్లపాటు అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. భూగర్భ పర్యావరణ మార్పులు భూగర్భ జలాల కలుషితానికి కారణం కావొచ్చని, అలాగే భూగర్భ రైలు ప్రయాణికులు అధిక వేడి కారణంగా అనారోగ్యంబారిన పడే ప్రమాదం ఉన్నదని శాస్ర్తవేత్తలు తెలిపారు.