హాట్టాహాసంగా ప్రారంభమైన ‘తెలంగాణ ట్రై క్రీడా వేడుకలు
- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ - నెక్లెస్ రోడ్ నిండా నవతరం సైక్లింగ్ సంబరం, స్కేటర్ల ఉత్సాహం - నీరా కేఫ్ వద్ద కేక్ కట్ చేసి, సైక్లింగ్ రేస్ ప్రారంభించి, సైకిల్ రేస్లో పాల్గొని జోష్ నింపిన - వేలాదిగా పాల్గొన్న యువత, కేసీఆర్ లాంగ్ లీవ్ నినాదాలతో మారుమోగిన నెక్లెస్ రోడ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కె. తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ట్రై క్రీడా వేడుకలు నెక్లెస్ రోడ్ వద్ద ఘనంగా ప్రారంభమైనాయి. తదుపరి ఇందిరా పార్కులో రోలల్ స్కేటింగ్ పోటీలను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఛైౖర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ప్రారంభించి స్కేటర్లను ఉత్సాహపరిచారు. మధ్యాహ్నం యూసుఫ్గూడా, కెవిబిఆర్ ఇండోర్ స్టేడియంలో మహిళల రెజ్లింగ్ పోటీలు ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గౌరవ కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న యూత్ ఐకాన్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. గత దశాబ్ది కాలం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత కల్పించిందని క్రీడారంగ రిజర్వేషన్లు, నియోజకవర్గాల్లో స్టేడియాల నిర్మాణం, అంతర్జాతీయ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, నగదు ప్రోత్సాహకాలు వంటి నిర్ణయాలతో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, క్రీడా శాఖ అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ గారి ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందని ఆయన తెలిపారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘సీఎం కప్ ` 2023’ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు.ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ స్కేటింగ్, రెజ్లింగ్ అంశాలలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు క్రీడాకారుల నుండి భారీ ఎత్తున స్పందన లభించిందని, యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారని వివరించారు. మానవ సమగ్ర అభివృద్ధి క్రీడా ద్వారానే సాధ్యమవుతుందన్న సందేశాన్ని ఈ క్రీడా పోటీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ క్రీడా పోటీల విజయవంతానికి ముందుకు వచ్చిన తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, తెలంగాణ రోలల్ స్కేటింగ్ అసోసియేషన్, తెలంగాణ ఆమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఐటి పారిశ్రామిక అభివృద్ధిలో క్రీయాశీలక పాత్ర వహిస్తూ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంలో కెటిఆర్ గారి కృషి ఎనలేనిదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ ఛైర్మన్లు పల్లె రవికుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్లు అతిథులుగా హాజరైనారు. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లారెడ్డి, దత్తాత్రేయ వెటర్న్ సైక్లిస్ట్ మర్రి లక్ష్మారెడ్డి, తెలంగాణ రోలల్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు సిహెచ్ సురేష్, నిర్మల్సింగ్, రెజ్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు నర్సింగ్రావు, డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రేమ్రాజ్, ప్రభుత్వ ఫిజికల్ కళాశాల ప్రిన్సిపల్ రామిరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ కోచ్లు రవీందర్, గోకుల్, జితేందర్, జైపాల్, విజయభాస్కర్, సుధాకర్, శ్రీకాంత్, క్రీడా అధికారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.