మానవ సహిత అంతరిక్ష యాత్ర దిశగా ఇస్రో మరో ముందడుగు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: గగన్‌యాన్‌ ప్రయోగం దిశగా ఇస్రో మరో ముందడుగు వేసింది. మానవసహిత అంతరిక్ష యాత్ర కలను సాకారం చేసుకునే దిశగా కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్‌లో కీలక పాత్ర పోషించే ప్రొపల్షన్‌ సిస్టమ్‌ పనితీరును మెరుగుపరిచేందుకు గానూ చేపట్టిన పరీక్ష విజయవంతమైంది. ఈ మేరకు గురువారం ఇస్రో వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. గగన్‌యాన్‌కు సంబంధించిన సర్వీస్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎంపీఎస్‌) పనితీరును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షలు ప్రొపల్షన్‌ పనితీరును ధ్రువీకరిస్తాయి. వీటిలో వచ్చే ఫలితాల ఆధారంగా దాని పనితీరును శాస్త్రవేత్తలు మరింత మెరుగుపరుస్తారు.

మూడు రోజుల యాత్ర

మానవసహిత అంతరిక్ష యాత్రలో భాగంగా ఇస్రో గగన్‌యాన్‌ను ప్రారంభించింది. ఈ యాత్ర మూడు రోజుల పాటు ఉంటుంది. ఈ మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌకను భూమికి 400 కి.మీ దూరంలోని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. మూడు రోజుల అనంతరం వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి చేర్చడమే ఇస్రో లక్ష్యం.

మరో మూడు పరీక్షలు

సర్వీస్‌ మాడ్యూల్‌- సిస్టమ్‌ డిమాన్‌స్ట్రేషన్‌ మాడల్‌ (ఎస్‌ఎం-ఎస్‌డీఎం)ఫేజ్‌-2 టెస్టుల్లో భాగంగా రెండో, మూడో హాట్‌ టెస్టులను తాజాగా నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని ఇంజిన్ల పనితీరును సమీక్షించారు. థ్రస్టర్‌ ఇంజిన్లను కంటిన్యూయస్‌, పల్స్‌ మోడ్‌లలో విజయవంతంగా పరీక్షించినట్టు ఇస్రో తెలిపింది. ఈనెల 19న మొదటి హాట్‌ టెస్టును ఇస్రో నిర్వహించింది. వీటితో పాటు మరో మూడు హాట్‌ టెస్టులను నిర్వహించనున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ సర్వీస్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎంపీఎస్‌)ను బెంగళూరు, తిరువనంతపురంలోని వలియామలలో ఉన్న లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్లలో అభివృద్ధి చేశారు. ‘తరువాతి టెస్టులో 350 సెకన్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. తదుపరి పరీక్షను చివరి కక్ష్యను చేరుకునేందుకు వీలుగా నిర్వహించనున్నాం. అందులో భాగంగా ఎల్‌ఏఎం ఇంజిన్లను కంటిన్యూయస్‌ మోడ్‌లో, ఆర్‌సీఎస్‌ థ్రస్టర్లను పల్స్‌ మోడ్‌లో మండించనున్నాం’ అని ఇస్రో తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.