భారీ వర్షాలకు మనేరు వాగుకు వరద
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారీ వర్షాలతో మున్నేరు వాగుకు వరద పోటెత్తింది. ఖమ్మం నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లోని (ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ (వైపు వెళ్లే వాహనాలను పోలీసులు కోదాడ (వద్ద దారి మళ్లిస్తున్నారు హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాహనాలను హుజూర్నగర్, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా విజయవాడకు వెళ్లేలా ఏర్పాటు చేశారు.
ఖమ్మంను ముంచెత్తిన మున్నేరు
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. సహాయక చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి అనుక్షణం పర్యవేక్షించారు. మున్నేరు వరద ఉధృతి పెరగడంతో మైక్తో అప్రమత్తం చేస్తూ ఇళ్లల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ కమాండర్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ నేతృత్వంలో విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం లోతట్టు ప్రాంతాలైన పద్మావతి నగర్, గుర్రం ఫంక్షన్ హాల్ ప్రాంతం, మంచికంటి నగర్, బొకలగడ్డ వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. ఇళ్లలో, మేడపై మిగిలి ఉన్న బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పద్మావతి నగర్లోని ధ్యాన మందిరంలోని భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బృందాలుగా ఏర్పడి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనం రెండో అంతస్తులో బిక్కు బిక్కు మంటూ భయాందోళనలో ఉన్న మునగాటి లక్ష్మీనారాయణ, మునగాటి లక్ష్మీదేవి, మునగాటి యశ్వంత్, ప్రవళ్లిక, అరవింద్, కావ్య, విఘ్నేష్ 5 నెలల బాబుతోపాటు బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్కు చెందిన 20మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.