హైదరాబాద్-విజయవాడ మార్గంలో టీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదల నేపథ్యంలో పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ ఆర్టీసీ రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించగలరని సూచించారు.