విశ్వ హిందూ పరిషత్, నిరసన ప్రదర్శనలకు సుప్రీంకోర్టు అనుమతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలను నిరసిస్తూ ఢిల్లీ నగరంలో నిరసన ప్రదర్శనలను నిర్వహించేందుకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నగరంలో జరిగే ప్రదర్శనలలో విద్వేష ప్రసంగాలు, హింసాత్మక సంఘటనలు లేకుండా జాగ్రత్త వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నిరసన ప్రదర్శనలను నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.ఈ పిటిషన్ను జర్నలిస్ట్ షహీన్ అబ్దుల్లా దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ సీయూ సింగ్ వాదనలు వినిపించారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 23 చోట్ల నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని వీహెచ్పీ, బజరంగ్ దళ్ ప్రకటించాయని తెలిపారు. ఈ ప్రదర్శనలను నిలిపేయాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ, ఈ నిరసన ప్రదర్శనలను నిలిపేసేందుకు నిరాకరించింది. ఈ ప్రదర్శనల్లో విద్వేష ప్రసంగాలు చేయకుండా, హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది, తదుపరి విచారణ ఈ నెల 4న జరుగుతుందని తెలిపింది.హర్యానాలోని నుహ్ జిల్లాలో వీహెచ్పీ తదితర సంస్థలు నిర్వహించిన జలాభిషేక యాత్రను జూలై 31న ఓ వర్గం వారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. వందలాది మంది దుండగులు ఈ యాత్రపైకి దాడి చేసి, రాళ్లు రువ్వారు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను, వాహనాలను తగులబెట్టారు. పోలీస్ స్టేషన్ గోడను ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 116 మంది గాయపడ్డారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టార్, హోం మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు.