చైనా న్యూస్ క్లిక్’కు నిధులపై రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియన్ మీడియా సంస్థల్లో కొన్నిటికి చైనా నుంచి నిధులు అందుతున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించడంతో అలజడి మొదలైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ, మీడియా న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’కు చైనా నిధులు అందడాన్ని సమర్థించినందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ని డిమాండ్ చేశారు.బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, ‘న్యూస్ క్లిక్’కు కాంగ్రెస్ అండదండలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హస్తం ‘న్యూస్ క్లిక్’తో ఉందని, ‘న్యూస్ క్లిక్’పైన చైనా హస్తం ఉందని ఆరోపించారు. ‘న్యూస్ క్లిక్’కు కాంగ్రెస్ ఎందుకు మద్దతిస్తోందో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా నుంచి నిధులను ఏ విధంగా స్వీకరించిందో, ఆ సొమ్మును ఎక్కడ ఖర్చుపెట్టారో తెలియజేయాలన్నారు.నిధులు ఎవరు ఇచ్చారు? ‘న్యూస్ క్లిక్’కు కాంగ్రెస్ ఎందుకు మద్దతిస్తోంది? అనే అంశాలను రాహుల్ స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఒలింపిక్స్కు రావాలని సోనియా గాంధీని చైనా ఆహ్వానించిన తర్వాత ఈ మొత్తం కథ ప్రారంభమైందా? చెప్పాలని కోరారు.