ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్)లో ఎంటెక్ చదువుతోన్న మమితా నాయక్ సోమవారం సాయంత్రం క్యాంపస్లోని హాస్టల్ గదిలో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. విద్యార్ధిని మమితా నాయక్ ‘ర్యాగింగ్’ కారణంగా సూసైడ్ చేసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం మమిత చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఎప్పటిలాగే సంతోషంగా మట్లాడిందని, తమకు ఏ మాత్రం అనుమానం కలిగినీ సర్వశక్తులు ఒడ్డి తమ బిడ్డను కాపాడుకునేవారమని కన్నీరుమున్నీరుగా విలపించారు. అదే రోజు భువనేశ్వర్లోని తన ఫ్రెండ్కు ఫోన్ చేసి తన చదువు గురించి, కెరీర్ గురించి చాలాసేపు మాట్లాడింది. ఐతే డిప్రెషన్కు సంబంధించిన సంకేతాలేవీ ఆమె మాటల్లో కనిపించలేదని మమిత స్నేహితురాలు తెలిపింది.
ఒడిశాలోని సోనాపూర్ జిల్లా డుమ్రి గ్రామానికి చెందిన మమిత ఐఐటీ హైదరాబాద్లో ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సోమవారం రాత్రి భోజనానికి డైనింగ్ హాల్ వద్ద కనిపించకపోవడంతో తోటి స్నేహితులు ఆమె గది వద్దకు వెళ్లారు. గది తలుపులు ఎంతకూ తెరచుకోకపోవడంతో హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. హాస్టల్ సిబ్బంది సమాచారం మేరకు రాత్రి 9 గంటల పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. గదిలో లభించిన సూసైడ్ నోట్ను సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ రాజేష్ నాయక్ స్వాధీనం చేసుకున్నాడు.
ఒరియాలో ఉన్న సూసైడ్ లెటర్లో మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యల గురించి పేర్కొంది. ఐతే చదువుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఒడిశాకు చెందిన ఓ ప్రొఫెసర్ సూసైడ్ లెటర్ను చదివి వినిపించారు. జూలై 26న హాస్టల్లో చేరానని, పీజీ విద్యార్థులకు సింగిల్ రూమ్లు కేటాయించినందునందుకు తనకు రూమ్మేట్ లేరని మమిత తన లెటర్లో పేర్కొంది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఐతే గదిలో లభించిన సూసైడ్ లెటర్పై మృతురాలి తల్లిదండ్రులు అనుమానాలు లేవనెత్తుతున్నారు. నిజంగా మమిత సూసైడ్ నోట్ రాసి ఉంటే ఒడియా భాషలో రాసి ఉండేది. ఎందుకని.. సూసైడ్ నోట్ను ఒడియాలో రాయడానికి బదులు ఆంగ్ల వర్ణమాలలో రాసి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. హాస్టల్ సీనియర్లు ర్యాగింగ్ వల్లనే తమ కుమార్తె మరణించిందరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.