ప్రసవానికి, మళ్లీ గర్భం ధరించడానికి మధ్య 18 నెలల వ్యవధి ఉండాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అది సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా.. ప్రసవానికి, మళ్లీ గర్భం ధరించడానికి మధ్య కనీసం పద్దెనిమిది నెలల వ్యవధి ఉండాలి. ఈ నియమం తల్లీ బిడ్డలు ఇద్దరికీ మంచిది. ఒకసారి బిడ్డకు జన్మనిచ్చాక తల్లి శరీరం పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. అలా కాకుండా ముందుగానే గర్భం ధరిస్తే శరీరానికి మరో బిడ్డను మోసే శక్తి ఉండదు. నెలలు నిండకుండానే ప్రసవం కావడం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం లాంటివి జరుగుతాయి.అంతేకాదు, బిడ్డకు రకరకాల ఆరోగ్య సమస్యలూ రావచ్చు. తొలి బిడ్డకు పాలిస్తూనే, మరో బిడ్డను మోయడం వల్ల తల్లికి రక్తం సరిపోక ఎనీమియా రావచ్చు. అలాగే ఎడం పాటించకుండా గర్భం ధరించడం వల్ల తొలిబిడ్డకు కనీసం ఏడాది, ఏడాదిన్నర పాటు పాలు పట్టే అవకాశం ఉండదు. దీంతో బిడ్డ మీద సరిగా శ్రద్ధ పెట్టలేరు. కడుపులోని పాపాయే కాదు, పుట్టిన బిడ్డా ఆరోగ్యంగా ఎదగలేదు. కాబట్టి, మీరు తప్పకుండా ఈ ఎడం పాటించాలని గైనకాలజిస్ట్ లు చూచిస్తున్నారు.