వారం రోజుల్లో తొలి విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఇండ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారంలో తొలి విడుతలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. జీహెచ్ఎంసీలో లక్ష ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే 4,500 ఇండ్ల పంపిణీ పూర్తయ్యిందని చెప్పారు.70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 70వేల ఇండ్లను ఐదారు దశల్లో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. వచ్చే వారంలోనే తొలి దశ ఇండ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే పద్మారావు, జీహెచ్ఎంసీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.