చంద్రుడిపై ల్యాండింగ్ కు పోటీపడుతున్న భారత్, రష్యా

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చంద్రయాన్-3, లూనా-25 మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్నది. ఈ రెండింటిలో ఏది ముందు చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుందనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. చంద్రయాన్‌-3 ఆగస్టు 23న ల్యాండ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. అయితే రష్యా అంతరిక్ష కేంద్రం మాత్రం లూనా-25 ల్యాండింగ్‌పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

వెలుతురు ఆధారంగా ల్యాండింగ్‌

చంద్రుడిపై ల్యాండింగ్‌కు వెలుతురు ఎంతో ముఖ్యం. చంద్రుడి ఉపరితలంపై ఆగస్టు 23న పగలు మొదలవుతుంది. ఇస్రో అదే రోజు ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ రష్యా మాత్రం ఆగస్టు 21-23 మధ్య ఏ రోజు అనేది స్పష్టంగా చెప్పడం లేదు. వెలుతురును దృష్టిలో ఉంచుకొని చూస్తే రెండూ స్వల్ప సమయం తేడాతో ల్యాండ్‌ అయ్యే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బరువే చంద్రయాన్‌కు ప్రతికూలం

చంద్రయాన్‌-3 సుమారు 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడిపై కాలు మోపనున్నది. కానీ లూనా-25 మాత్రం 11 రోజుల వ్యవధిలోనే చంద్రుడ్ని చేరుకునే అవకాశం ఉన్నది. సామర్థ్యంలో ఉన్న తేడానే దీనికి కారణంగా తెలుస్తున్నది. తక్కువ బరువు, అధిక ఇంధన సామర్థ్యం ఉన్న కారణంగా లూనా-25 వేగంగా చంద్రుడిని చేరుకుంటున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 3900 కిలోలు ఉండటం కూడా చంద్రయాన్‌-3కి ప్రతికూలంగా మారింది. లూనా-25 బరువు కేవలం 1750 కిలోలు. చంద్రుడిపైకి చేరుకున్న తర్వాత చంద్రయాన్‌-3కి సంబంధించిన రోవర్‌ 14 రోజులు పరిశోధనలు జరపనుండగా, లూనా-25 మాత్రం ఏడాది పాటు పని చేయనున్నది.

Leave A Reply

Your email address will not be published.