లక్షన్నర దాటిన మద్యం దుకాణాల దరఖాస్తులు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్లో ముగియనున్నది. ఈ క్రమంలో మూడునెలల ముందుగానే ప్రభుత్వం 2023-25 కాలపరిమితికి ఈ నెల 4 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. అయితే, ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకునేందుకు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు లక్ష దాటాయి.అత్యధికంగా శంషాబాద్, సరూర్నగర్లో 8వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం జిల్లాలో 6వేలకుపైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేసేందుకు ఈ నెల 3న ఎక్సైజ్శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సులు నవంబర్ 30వ తేదీతో ముగియనున్నారు. కొత్తగా జారీ చేయనున్న లైసెన్సులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.పాత విధానం ద్వారా ఈ సారి మద్యం దుకాణాల లైసెన్సులను ఎక్సైజ్శాఖ జారీ చేయనున్నది. ఇక మద్యం దుకాణాల్లో ప్రభుత్వం గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్లు కేటాయించగా.. ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు మరో ఐదుశాతం రిజర్వేషన్లు ఇచ్చింది. రాష్టవ్యాప్తంగా గీత కార్మికులకు 363, దళితులకు 262, గిరిజనులకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలు రిజర్వేషన్ల ప్రాతిపాదికన కేటాయించనుండగా.. మిగతా 1,864 మద్యం దుకాణాలు జనరల్ కేటగిరి కింద లైసెన్సులు జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా దుకాణాల లైసెన్సులను కేటాయించనున్నారు.