ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతీయ పన్ను వ్యవస్థను మళ్లీ ప్రశ్నించారు డోనాల్డ్ ట్రంప్. ఇటీవల ఫాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. భారత్ విధించే సుంకం అధికంగా ఉంటుందని ఆయన అన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక స్థాయిలో పన్ను వసూల్ చేస్తోందన్నారు. ఒకవేళ మళ్లీ దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే ఇండియా ఉత్పత్తులపై భారీ స్థాయిలో పన్ను విధించనున్నట్లు ఆయన తెలిపారు.వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆయన.. భారతీయ పన్ను వ్యవస్థను తప్పుపట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక స్థాయిలో దిగుమతి సుంకాన్ని వసూల్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. లారీ కుడ్లో అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. ఒకవేళ మళ్లీ తాను దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే, అప్పుడు భారతీయ ఉత్పత్తులపైన దిగుమతి సుంకాన్ని పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పన్నులను వసూల్ చేయడంలో భారత్ టారిఫ్ కింగ్ అని గతంలో ఓ సారి ట్రంప్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. హర్లే డేవిడ్సన్ మోటార్సైకిళ్లపైన కూడా భారత్ భారీగా పన్ను వసూల్ చేస్తున్నట్లు ఆయన గతంలో ఆరోపించారు. 2018లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల.. అప్పట్లో బైక్లపై కస్టమ్స్ డ్యూటీని 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు.