దమ్మున్న ధైర్యంగల్ల ముఖ్యమంత్రి కెసిఆర్ : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను.. ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. తెలంగాణకు ఇది ఉత్సాహకరమైన సమయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ ధైర్యవంతమైన నాయకత్వంపై, ప్రభావశీలమైన బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారన్న నమ్మకముందన్నారు.ఈ సందర్భంగా పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించి మరోసారి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ కోరారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు.ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులకే ఛాన్స్ ఇచ్చినట్లు కేసీఆర్ ప్రకటించారు. గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు. కంటోన్మెంట్ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్ నిరాకరించినట్లు సీఎం చెప్పారు.