అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ నేతల ఆరోపణలు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం సాహసోపేత నిర్ణయమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిత్వత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రావాలని స్వామివారిని కోరానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని.. దీనికోసం అందరి సహకారం తీసుకుంటానని తెలిపారు.కేసీఆర్ నాయకత్వంలో 9 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండమైన ప్రగతి సాధించిందని ఎమ్మెల్యీ కడియం శ్రీహరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే అనుసరించే విధంగా రాష్ట్ర పథకాలు ఉన్నాయని ఆయన కొనియాడారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. దేశానికే ఆదర్శంగా కల్యాణలక్ష్మీ, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు అమలవుతున్నాయని తెలిపారు. 44 లక్షల మందికి రూ.2,116 చొప్పున ఆసరా పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటే అని ఆయన పేర్కొన్నారు. ఈస్థాయిలో పింఛన్లు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో కాంగ్రెస్, బీజేపీలు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అవగాహనరాహిత్యంతో కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు