ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి కొత్త మాడ్యుల్స్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నది. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది. ఆయా ఆప్షన్లతో జిల్లాల్లో నెలకొన్న భూసమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు.
ఇవి కొత్త మాడ్యుల్స్
- భూమి రిజిస్ట్రేషన్ సమయంలో దాని విస్తీర్ణం, మార్కెట్ విలువను తెలుసుకొని రిపోర్టును కూడా పొందే అవకాశాన్ని కల్పించారు.
- క్రయ, విక్రయాల సమయంలో భూమి మార్కెట్ విలువను తెలుసుకోవచ్చు.
- గిఫ్ట్, సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్లలో ఒక్కరికే కాకుండా ఎక్కువ మంది కొనుగోలు చేసేలా, విక్రయించేలా అవకాశం కల్పించారు.
- ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లోని వారు బ్యాంకుల్లో మార్టిగేజ్లకు కుల ధ్రువీకరణ పత్రం జతచేయాలనే నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు.
- పేరు, జండర్, ఆధార్, కులం క్యాటగిరి మార్పు చేర్పులకు టీఎం 33 మాడ్యుల్ నుంచి మినహాయింపునిచ్చారు.
- పట్టా భూముల పత్రాల్లో అసైన్డ్ అని నమోదయితే భూమి రకం, భూమి వర్గీకరణ, భూమి సాగుకు సంబంధించిన టీఎం 33 మాడ్యుల్ కింద పరిష్కారం చూపనున్నారు. ఇందులో అసైన్డ్ భూములను మినహాయింపునిచ్చారు.
- సీసీఎల్ఏ, కలెక్టర్ లాగిన్లలో గ్రామ పహాణి రిపోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
- పట్టా పాస్ పుస్తకాల్లో నమోదయిన వివరాలు సరిచేయడానికి వచ్చిన దరఖాస్తుల్లో ఏవైనా తేడాలుంటే వాటిని తిరస్కరించకుండా అవకాశం కల్పించడానికి, ఆయా జాబితాలు కలెక్టర్లకు అందుబాటులోకి రానున్నాయి.