తమిళనాడులోని మధురైలో ఘోర ప్రమాదం
- ప్రయివేటు పార్టీ కోచ్లో మంటలు చెలరేగి 10 మంది సజీవదహనం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తమిళనాడులోని మధురైలో ఘోర ప్రమాదం జరిగింది. పునలూరు – మధురై ఎక్స్ప్రెస్లోని ఓ ప్రయివేటు పార్టీ కోచ్లో మంటలు చెలరేగి 10 మంది సజీవదహనం అయ్యారు. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న ఈ రైలులో శనివారం తెల్లవారుజామున 5:15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న పునలూరు – మధురై ఎక్స్ప్రెస్ రైలుకు నాగర్కోయిల్ వద్ద ప్రయివేటు పార్టీ కోచ్ను నిన్న సిబ్బంది చేర్చింది. ఈ కోచ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రైల్వే సిబ్బంది కళ్లుగప్పి.. సిలిండర్ను రహస్యంగా లోపలికి తీసుకొచ్చారు. ఇక శనివారం తెల్లవారుజామున మధురై స్టాబ్లింగ్ లైన్ వద్ద.. ప్రయివేటు పార్టీ కోచ్ను మధురై ఎక్స్ప్రెస్ నుంచి వేరు చేశారు. ఈ సమయంలో చాయ్ చేసుకునేందుకు ఆ కోచ్లోని పర్యాటకులు సిలిండర్ను వెలిగించారు. దీంతో కోచ్లో సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమైన కిందకు దిగేశారు. 10 మంది సజీవదహనం అయ్యారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు