విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ను రూపొందించింది నేనే

- సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి మీడియాకు ఇంటర్వ్యూలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతమైంది. ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి తనను తాను ఇస్రో శాస్త్రవేత్తనని, విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ను రూపొందించానని చెప్పుకుంటూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సూరత్‌ కమిషనర్‌ అజయ్‌ తోమర్‌ ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించాలని క్రైమ్‌ బ్రాంచ్‌ను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. విక్రమ్‌ ల్యాండ్‌ మాడ్యూల్‌ను తానే రూపొందించానని మితుల్‌ త్రివేది అనే యువకుడు మీడియాకు ఇంటర్వ్యూలో ఇచ్చాడు. మూన్‌ మిషన్‌లో పని చేసేందుకు ఇస్రో తనను ఆహ్వానించిందని చెబుతున్నాడు.ఇస్రోలో పని చేస్తున్న సమయంలో ల్యాండర్‌లో అనేక మార్పులు చేశానని, దీని ఫలితంగానే మాడ్యూల్‌ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్‌ అయ్యిందని పేర్కొంటున్నాడు. అయితే, ఇస్రో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారా? అని ప్రశ్నించగా ఫ్రీలాన్సర్‌గా అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే, తాను నాసాతో కూడా కలిసి పని చేస్తున్నట్లు పేర్కొంటుండడం గమనార్హం. అయితే, ఇస్రోతో కలిసి పనిచేసిన్నట్లు చేస్తున్న వాదనలకు మద్దతుగా సాక్ష్యాలను చూపించడంలో సదరు యువకుడు విఫలమయ్యారు. కొన్ని మీడియా సంస్థలను తమ కార్యాలయాలకు పిలిచి.. చంద్రయాన్‌-3లో పని చేసినట్లుగా రుజువులు చూపించాలని కోరగా.. ఎలాంటి పత్రాలను అతను చూపించలేకపోయాడు. అయితే, పోలీసుల ప్రాథమిక విచారణలో అతను బీకాం డ్రిగీ చేసినట్లు తేలింది. మితుల్‌ త్రివేది ఇస్రో శాస్త్రవేత్త కాదని డీసీపీ హేతల్‌ పేర్కొన్నారు. క్రైమ్‌ బ్రాంచ్‌ పూర్తి విచారణ జరుపుతుందని, విచారణలో తప్పని తేలితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.