తెలంగాణ జ్యోతి/వేబ్ న్యూస్: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి, భంగపడ్డ పల్లె రవికుమార్ గులాబీ గూటికి చేరారు. చండూరు ఎంపీపీగా కొనసాగుతున్న ఆయన భార్య కళ్యాణి కూడా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ గౌడ్ దంపతులకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి పల్లె రవి తమతో కలిసి పని చేశారని పేర్కొన్నారు. పల్లె రవి మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషమని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి అందరం కలిసి కృషి చేస్తామన్నారు. పల్లె రవికి భవిష్యత్లో మరిన్ని అవకాశాలను పార్టీ కల్పిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.