మంకాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి సబిత
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మంకాల్ లో శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, మలక్ పేట్, యాఖుత్ పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట సంబంధించి లాటరీ ద్వారా కేటాయించిన 2,230 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు.ఇటీవల లక్కీ డ్రాలో రెండు పడకల గదులు దక్కించుకున్న లబ్ధిదారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇళ్ల మంజూరు పత్రాలు అందించి,గృహ ప్రవేశాలు చేయించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మ గౌరవంతో గొప్పగా జీవించాలనే గౌరవ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టు రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 2 వేల మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని, పేదవారు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఉద్దేశ్యంతో ఇళ్ళు కట్టించడం జరిగిందని, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారికీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, మలక్ పేట్ శాసన సభ్యులు బలాల, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రతిమా సింగ్, తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు.