బస్సు పై ఏనుగుల దాడి భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగులు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లాలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు భార్యాభర్తలపై దాడి చేసి చంపేయగా.. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగు బస్సుపై దాడి చేసింది. రహదారిపై బీభత్సం చేసింది (Elephant Attack on Bus). ప్రయాణికులను పరుగులు తీయించింది. పార్వతీపురం – రాయగడ ప్రధాన రహదారిపై కొమరాడ మండలం ఆర్తాం గ్రామం వద్ద ఒంటరి ఏనుగు బీభత్సం చేసింది. రోడ్డుకు అడ్డంగా నిల్చుని వాహనాలను ఆపేసింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు మీదకు వెళ్లి దాడికి దిగింది. తొండంతో ఒక్క ఉదుటన బస్సు అద్దాలను పగులగొట్టింది. బస్సును అమాంతం వెనక్కి తోసేసింది. బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. బస్సు బోల్తా పడుతుందేమోనని భయపడ్డారు.బస్సులోని ప్రయాణీకులు కిందికి దిగి దూరంగా పరుగులు తీశారు. ఈ క్రమంలో ఆ ఏనుగు ఓ ప్రయాణికుడి వెంట పడింది. ఏనుగు దాడి నుంచి అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. కర్రలతో సహాయంతో బెదిరిస్తూ ఏనుగును తరిమేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. అది అస్సలు బెదరకపోగా.. మరింత రెచ్చిపోయింది.అక్కడే ఉన్న గ్రామ (ఆర్తాం) సచివాలయంపై ఏనుగు దాడి చేసింది. అక్కడ పార్క్ చేసి ఉన్న రెండు బైకులను ధ్వంసం చేసింది. అటూ ఇటూ తిరుగుతూ అందరినీ హడలెత్తించిన ఆ గజరాజం.. కాసేపటి తర్వాత పంట పొలాల మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఆ ఒంటరి ఏనుగు పేరు హరి అని, అది గుంపు నుంచి తప్పిపోయి సంచరిస్తోందని అధికారులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురంలో ఓ ఒంటరి ఏనుగు.. దంపతులను తొక్కి చంపేసింది. ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. బంగారుపాళ్యం మండలం మొగలివారిపల్లె వద్ద మరో ఒంటరి ఏనుగు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

Leave A Reply

Your email address will not be published.