పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ…మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్లో వెలసిన పోస్టర్లు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్లో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ మధు యాష్కి గో బ్యాక్ టు నిజామాబాద్ అంటూ పోస్టర్లు వెలిశాయి.2009 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన మధుయాష్కి.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి చవిచూశారు. దీంతో ఆయన ఈసారి పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి కాకుండా.. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ స్థానిక నేతలైన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు, మరో నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి సైతం అభ్యర్థిత్వం కోసం అప్లయ్ చేసుకున్నారు. దీంతో పోటీ త్రిముఖంగా మారింది. ఈ నేపథ్యంలో కష్టకాలంలో కూడా నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తారేమోనని అక్కడి నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో యాష్కికి వ్యతిరేకంగా గాంధీ భవన్లో పోస్టర్లు వెలవడం గమనార్హం.