విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసే భాద్యత ఉపాధ్యాయులదే
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యార్థులు విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ, సామాజిక నేపథ్యం కలిగి ఉంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల అవసరాలను గుర్తించి అందించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసే పనిని తమ బాధ్యతగా గుర్తించి ఉపాధ్యాయులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు సబితా ఇంద్రారెడ్డి. మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను ఆమె ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ గురువులను జీవితాంతం గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించే విధంగా విద్యా భోధన చేయాలని మంత్రి కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తున్నామని తెలిపారు. టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ విద్యారంగం అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యారంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించి అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తున్నామని, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 29,611 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. పాఠశాల విద్యలో అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతున్న మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 26 ,065 పాఠశాలల్లో 3 సంవత్సరాల్లో 3 దశల్లో రూ. 7,289 కోట్లతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 1,94,370 మంది విద్యార్థులతో 682 గురుకులాలు ఉండగా, 2023 నాటికి
7,44,759 మంది విద్యార్థులతో 1517 గురుకులాలకు చేరుకున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2017లో మొదటిసారిగా టీఆర్టీ నిర్వహించి 8972 పోస్టులను భర్తీ చేశాం. ప్రస్తుతం డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయ పోస్టులను, 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో 520, కాలేజియేట్ ఎడ్యుకేషన్లో 280, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 3096 పోస్టులను రెగ్యులరైజ్ చేయడం జరిగిందని తెలిపారు. గురుకులాల్లో 11,715 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని, మరో 12,150 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదని సబిత పేర్కొన్నారు.
ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు వాణిదేవి, రఘోత్తం రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఆయాచితం శ్రీధర్, శ్రీధర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్.కె.మహమూద్, పాఠశాల విద్య సంచాలకులు శ్రీ దేవసేన, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు.