మొరాకోను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రకేష్‌ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ భూకంపం ధాటికి 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకూ 632 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఇంటీరియర్‌ మంత్రి వెల్లడించారు. సుమారు 329 మంది గాయాలపాలైనట్లు చెప్పారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 51 మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వెల్లడించారు.కాగా, మర్రకేష్‌కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. ఆల్‌ హౌజ్‌, మర్రకేష్‌‌, క్వార్జాజేట్‌, అజిలాల్‌ సహా పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ చవిచూడలేదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. మరోవైపు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.