ఆంధ్ర ప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండించారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి వేళ ఏపీలో అరెస్టులు చేస్తున్నారని వెల్లడించారు. గతంలో విశాఖపట్నంలో కూడా తమపట్ల ఇదే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఇండ్ల నుంచి బయటకు రాకూడదంటే ఎలా అని ప్రశ్నించారు.వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు నిరసనలు చేయడం తప్పా అన్నారు. చంద్రబాబు అరెస్టు కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనని విమర్శించారు. చంద్రబాబు పట్ల ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఏ తప్పుచేయని నాయకులపై కూడా హత్య కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు శనివారం ఉదయం నంద్యాలలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు.