మణిపూర్ లో మరోసారి హింసా కాండ
- రెచ్చిపోయిన నిషేధిత ఉగ్రవాద గ్రూపులు - ముగ్గురు గిరిజనుల కాల్చివేత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మరోసారి అక్కడ హింస చెలరేగింది. కాంగ్పోకి జిల్లాలో నిషేధిత ఉగ్రవాద గ్రూపులు రెచ్చిపోయాయి. ఈ ఉదయం కుకీ-జో వర్గానికి చెందిన ముగ్గురు గిరిజనులను కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు వాహనంలో వచ్చి ఇంఫాల్ వెస్ట్, కాంగ్పోప్కి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఇరెంగ్, కరం ప్రాంతాల మధ్య గ్రామస్థులపై దాడి చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయినట్లు వారు వెల్లడించారు.మరోవైపు మణిపూర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థలు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. తిరిగి యాక్టివ్ అవుతున్నాయని, లెఫ్టినెంట్ కర్నల్పై కాల్పుల ఘటన వెనుకున్నది ఈ సంస్థలేనని నిఘావర్గాలు వెల్లడించాయి. నిరసనకు దిగుతున్న గుంపులోకి ఉగ్రవాద సంస్థల సభ్యులు చొరబడుతున్నారని కేంద్ర భద్రతా బలగాలు భావిస్తున్నాయి. గతవారం టెంగ్నోపాల్ జిల్లాలోని ఓ గ్రామం వద్ద కొంతమంది ఆందోళన చేపట్టగా.. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ అడ్డుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారి కాల్పులు చోటుచేసుకోగా.. లెఫ్టినెంట్ కర్నల్ రామన్ త్యాగీకి బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన కేంద్ర భద్రతా బలగాలు.. గుంపుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల సభ్యులు చేరుతున్నారని నిర్ధారించాయి.