3 వేలకు చేరువలో మొరాకో మృతుల సంఖ్య..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మొరాకో లోని అట్లాస్‌ పర్వతాల్లో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భూకంపం ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. ఈ శక్తివంతమైన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 3,000 చేరువైంది.స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల సంఖ్య 2,862కు చేరింది. ఇక ఈ విపత్తుకు 2,500 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 100 మంది మొరాకో రక్షణ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోంది.భూకంపం వచ్చి ఇప్పటికే 72 గంటలకు పైనే అయిపోయింది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు సజీవంగా బయటకు వస్తారన్న ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. భూకంపం కేంద్ర ప్రాంతమైన అట్లాస్‌ పర్వత ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఎక్కడ చూసినా గుట్టలుగుట్టలుగా శవాలే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. దీంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో శిథిలాల వెలికితీత ఇప్పటి వరకూ చేపట్టనేలేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని పర్యాటక ప్రాంతమైన మర్రకేష్‌ కు 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్‌ పర్వత ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది సేపటికి 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మర్రకేష్‌కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. ఆల్‌ హౌజ్‌మర్రకేష్‌‌క్వార్జాజేట్‌అజిలాల్‌ సహా పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. 120 ఏళ్లలో ఇంత భారీగా ప్రకంపనలు రావడం ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.