బిడ్డకు ..తల్లిపాలే శ్రేష్టం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టిక ఆహారము. బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల తల్లి బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉండటమే, కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. అందుకే బిడ్డ పుట్టిన నాటి నుండి 6 నెలల వయసు వరకు అవసరాన్ని బట్టి ఏడాది వరకు తల్లిపాలే తాగించాలని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి లిల్లీ మేరి అన్నారు. తల్లిపాలలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ సమపాలలో ఉండటం వల్ల బిడ్డ శారీరక, మానసిక వికాసం వేగంగా వృద్ధి చెందుతుందని, కానీ ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదని, ఉద్యోగాలు, బిజీ లైఫ్ శారీరక సౌందర్యం తగ్గుతుందని అపోహ ఉందని, రకరకాల కారణాలతో పిల్లలకు తల్లిపాలు బదులు డబ్బా పాలు, పౌడర్ పాలన అలవాటు చేస్తున్నారు. ఇది శిశువుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపెడుతుందని, ఈ పరిస్థితుల్లో శిశువుకు తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు. మనదేశంలో ఎన్నో వేల మంది చిన్నారులు పసితనంలో పోషకాహార లోపానికి గురై బతికి బట్ట కట్టలేక పోతున్నారు. మనిషి వందేళ్ళ జీవితంలో ఒక ఏడాది కాలంలో మూడు రెట్లు ఎదిగేది. కేవలం పుట్టిన మొదటి సంవత్సరంలో మాత్రమే. జీవిత తొలిదశలో పోషణ విషయంలో జరిగే పొరపాట్లు లోటుపాట్లు వారి జీవితాంతం వెంటాడుతాయి. మనదేశంలో 50 శాతం మంది పిల్లలు రక్తహీనత గురవుతున్నారు. 50 శాతం మంది పొట్టిగా బరువు తక్కువగా ఉంటున్నారు. 56 శాతం శిశుమరణాలకు కారణము పోషకాహార లోపం మాత్రమేనది చెప్పవచ్చు. పుట్టిన ప్రతి వంద మంది శిశువులలో చాలావరకు మొదటి పుట్టినరోజు వరకు బతకడం లేదు. 10 శాతం మంది పిల్లలు అధిక బరువుతో అనారోగ్యవంతులవుతున్నారు. వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.
తల్లిపాలు సంతులిత ఆహారము. బిడ్డ ఆరోగ్యం పోషణకు అవసరమైన అన్ని రకాల పోషక విలువలు తల్లిపాలలో సమపాళ్లలో ఉంటాయి. తల్లి పాలు తాగించడం వల్ల శిశువు పెరుగుదల, ఆరోగ్యము, జీర్ణశక్తి తదితర వ్యవస్థలన్నీ చురుగ్గా పనిచేస్తాయి. తల్లిపాలలో ఉండే పస్సు పచ్చని కొలెస్ట్రాల్ అనే పదార్థం, గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థల పనితీరును అభివృద్ధి పరుస్తుంది. శిశువును ప్రమాదకరమైన పచ్చకామెర్ల వ్యాధి నుండి కాపాడుతుంది. ఏ కృత్రిమ పాలలో ఉండనటువంటి వంద రకాల పోషక విలువలు తల్లిపాలలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి పిల్లల సంపూర్ణ ఆరోగ్య వికాసానికి దోహదపడతాయి. తల్లిపాలలో ఉండే మ్యాక్రో ఫెజస్ అనే కణాలు శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్లను చంపి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తల్లిపాలలో కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువగా ఉండటం వల్ల గెలాక్టోస్, గ్లూకోస్ల వృద్ధి జరిగి శిశువుల్లో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. తల్లిపాలలో కరిగి ఉండే డిహెచ్ఏ, ఏఆర్ఏ వంటి కొవ్వు పదార్థాల వల్ల మెదడు, రెటీనా తదితర ప్రధాన విభాగాలలో కణజాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.