భారత్ కు ప్రత్యేక మినహాయింపు ఏమీ లేదు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఖలిస్తాన్‌ ఏర్పాటువాద నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో భారత్‌– కెనడా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది. ఆ తర్వాత దౌత్యవేత్తలను కెనడా బహిష్కరించింది. అయితే, దీనిపై భారత్‌ సైతం ఘాటుగానే స్పందించింది. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. వీసా సేవలను సైతం నిలిపివేసింది. కెనడాలో ఉన్న భారతీయులకు అప్రమత్తంగా ఉండాలంటూ అలెర్ట్‌ జారీ చేసింది.కాగా, రెండు దేశాల మధ్య నెలకొన్ని వివాదంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. రెండు దేశాలతోనూ తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివన్‌ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈ అంశంపై దౌత్యవేత్తలతో జరిగిన ప్రైవేటు సంభాషణల గురించి నేను మాట్లాడను. ఈ విషయంలో భారత్‌లో ఉన్న అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక ముందు కూడా వారితో టచ్‌లో ఉంటాం’ అని అన్నారు.ఇక ఇదే సమావేశంలో ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దౌత్యపరమైన వివాదంపై ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నారా..?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇది మాకు (అమెరికా) ఆందోళన కలిగించే విషయం. ఇది మేము తీవ్రంగా పరిగణించే అంశం. నిరంతరం దీనిపై సంప్రదింపులు చేస్తాం. ఈ విషయంలో భారత్‌కు ‘ప్రత్యేక మినహాయింపు’ ఏమీ లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.