చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ 27 కు వాయిదా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు (ACB Court) ఇన్చార్జీ జడ్జి బుధవారానికి వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్పై వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా, వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి అన్నారు. బుధవారం రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈ రోజు సెలవులో ఉన్నారు. దీంతో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇన్చార్జ్గా వ్యవహరించారు.కాగా, చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో బుధవారం విచారణ రానుంది. తన రిమాండ్ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అంగీకరించారు. ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి తెలియనుంది.