రాగల రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురువనున్నట్లు వాతావరణశాఖ చెప్పింది.మరో వైపు హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠంగా 30 డిగ్రీలు, కనిష్ఠంగా 22 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తాయని వివరించింది. మరో వైపు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి.