తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లండన్లోని థేమ్స్ నదిపై టవర్ బ్రిడ్జ్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ బ్రిడ్జ్ నదీ ప్రయాణానికీ, రోడ్డు రవాణాకూ వీలుగా నిర్మించారు. నదిలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఈ బ్రిడ్జ్ పైకి లేస్తుంది. పడవ వెళ్లిపోగానే ఆ బ్రిడ్జి యథావిథిగా కిందకు దిగుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియే. ఆ సమయంలో బ్రిడ్జ్కు ఇరువైపులా ఉన్న వాహనాలు నిలిచిపోతుంటాయి. అయితే, గురువారం నాడు ఆ బ్రిడ్జ్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మధ్యాహ్నం సమయంలో ఓ పడవ నదిలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రిడ్జ్ పైకి లేచింది. ఆ తర్వాత యథాస్థానానికి రాలేకపోయింది. దీంతో వంతెనపై నుంచి వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో లండన్ వీధుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.ఈ టవర్ వంతెనను 1894లో నిర్మించారు. ఇది గ్రేటర్ లండన్ బారోగ్స్ ఆఫ్ టవర్ హామ్లెట్స్, లండన్లోని సౌత్వార్క్ మధ్య థేమ్స్ నదిపై నిర్మించబడింది. ఈ బ్రిడ్జి 76 మీటర్లు (250 అడుగులు) వెడల్పు, 240 మీటర్లు (800 అడుగులు) పొడవు ఉంటుంది. ఈ వంతెన థేమ్స్ నదికి 61 మీటర్లు (200 అడుగులు) ఎత్తులో ఉంటుంది. రోడ్డు, నదీ ప్రయాణానికి వీలుగా నిర్మించిన ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.