దీర్ఘకాలిక రోగాలకు కారణం అవుతున్న బీపీ, షుగర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రాథమిక దశలోనే బీపీ, షుగర్‌లను గుర్తించి చికిత్స తీసుకోకపోవడం వల్ల దీర్ఘకాలిక రోగాలకు కారణం అవుతున్నాయన్నారు మంత్రి హరీశ్‌ రావు. వాటివల్ల గుండె, కిడ్నీలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నాయని చెప్పారు.ఒకప్పుడు కమ్యూనికబుల్ వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అధికమవుతున్నాయని అన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కనీస వ్యాయామం చేయకపోవడం, చెడు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు వంటివి దీనికి కారణమని చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలో 24 శాతం షుగర్, 14 శాతం బీపీ కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రభుత్వం బీపీ, షుగర్ మందులను ఉచితంగా అందిస్తున్నదని వెల్లడించారు. హైదరాబాద్‌లోని దుర్గంచెరువు వద్ద కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కువగా గుండె సమస్యలకు బీపీ ఒక కారణం అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ వల్ల దేశంలో ఏటా సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా ఎవరికైనా సడెన్ కార్డిక్‌ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అయితే సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యం అవుతుందన్నారు. జిమ్ చేస్తూ, పనులు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ కొంత మంది అకస్మాత్తుగా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటివి మనం తరచూ చూస్తున్నామని అన్నారు. ఆ సమయంలో సీపీఆర్‌ తెలిసిన వారు ఉంటే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అతి ముఖ్యమైన సీపీఆర్ విధానం గురించి మన దేశంలో 98 శాతం మందికి తెలియదన్నారు. ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని, శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారని వెల్లడించారు.ఇందులో భాగంగా, పారామెడికల్ సిబ్బందితోపాటు వైద్య, మున్సిపల్ సిబ్బంది, పోలీసు, కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ల ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సీపీఆర్ మీద శిక్షణ ఇచ్చామన్నారు. దీనికోసం అవసరమైన 1262 ఏఈడీ మిషన్లు సమకూర్చుకుని అన్ని సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.ప్రతిఒక్కరు బీపీ, షుగర్ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. బాడీ మాస్ ఇండెక్స్‌ని పరిమితిలో ఉంచుకోవాలన్నారు. బీపీ, షుగర్ నియంత్రణలో ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, రోజుకు కొంత సమయం వ్యాయామం, ధ్యానం చేసేందుకు కేటాయించాలని చెప్పారు.ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. అందరం ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ సాధ్యమవుతుందని చెప్పారు. కాగా, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలపై ప్రచారం కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఈరోజు వరల్డ్ హార్ట్ డేగా నిర్వహిస్తుంటారని, ఈ సారి ‘Use Heart, Know Heart’ అనే థీమ్‌తో నిర్వహించుకుంటున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.