ఎంపీ మేనకా గాంధీ పై ఇస్కాన్ వంద కోట్ల పరువు నష్టం దావా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గోశాలల్లో ఉన్న గోవుల్ని ఇస్కాన్ అమ్ముకుంటున్నదని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఎంపీపై వంద కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసేందుకు ఇస్కాన్ సిద్ధమైంది. కోల్కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ మాట్లాడుతూ.. మేనకా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తుల్ని ఆమె వ్యాఖ్యలు బాధించాయని, ఆమెపై వంద కోట్ల పరువునష్టం కేసు వేసేందుకు న్యాయ ప్రక్రియ చేపట్టామని, ఇవాళ ఆమెకు నోటీసు జారీచేశామని ఆయన అన్నారు. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అయిన ఆమె ఎటువంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థపై ఎలా ఆరోపణలు చేశారని రాధారామణ్ అన్నారు.కబేళాలకు గోవుల్ని అమ్ముకుంటున్నారని, దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసమని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ అన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతన్న ఇస్కాన్, తమ గోశాలల్లో ఉన్న గోవుల్ని అమ్ముకుంటున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణలనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల ఏపీలోని అనంతపురంలో ఉన్న గోశాలను సందర్శించినట్లు ఆమె చెప్పారు. అక్కడ పాలు ఇచ్చే ఆవు ఒక్కటి కూడా లేదని, దూడలు కూడా లేవని, మొత్తం డెయిరిలో ఒక్కటి కూడా పాలిచ్చే ఆవు లేదని, అంటే అక్కడ ఉన్న ఆవుల్ని అమ్ముకున్నారని తెలుస్తోందని ఆమె ఆరోపించారు.బీజేపీ ఎంపీ చేసిన తీవ్ర ఆరోపణల్ని ఇస్కాన్ ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని ఇష్కాన్ పేర్కొన్నది. గోవులు, ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్ తెలిపారు. కేవలం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని ఆదరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. గోవులకు జీవితాలను ప్రసాదిస్తున్నామని, వాటిని కబేళాలకు అమ్మడం లేదని ఇస్కాన్ చెప్పింది. ఇస్కాన్ ప్రతినిధి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో ఈ విషయాన్ని తెలిపారు.