బి ఆర్ ఎస్ దోచుకున్నదంతా కక్కిస్తా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీవ్యాఖ్యానించారు.  తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. మంగళవారం నాడు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన జనగర్జన సభలో మోదీ మాట్లాడుతూ.. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆస్పత్రులు, రైల్వేలైన్లు నిర్మిస్తున్నాం. ఎన్టిపిసి తో రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది. ఎన్టిపిసి పవర్‌ ప్లాంట్‌తో తెలంగాణలో ఎంతో మార్పు రానుంది. పెద్దపల్లి ఎన్టిపిసి పవర్‌ ప్లాంట్‌ను శరవేగంగా పూర్తిచేశాం. ఎన్టిపిసి ప్లాంట్‌ నుంచి తయారయ్యే విద్యుత్‌లో.. అధిక భాగం తెలంగాణకే కేటాయిస్తాం. ఎన్టిపిసి ప్లాంట్‌ శంకుస్థాపన చేసింది నేనే.. ప్రారంభించింది నేనే.మా గ్యారంటీలకు ఇదే నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు.

ఇది మా వర్క్‌ కల్చర్‌

తెలంగాణకు అండగా ఉంటాం. ఇక్కడి ప్రజల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. బీజేపీ ప్రభుత్వంశంకుస్థాపనలే కాదు.. ఆ పనులను కూడా సకాలంలో పూర్తి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తెలంగాణ ప్రజల విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు మేము కృషి చేస్తున్నాం. త్వరలో భారతీయ రైల్వే 100 శాతం ఎలక్ట్రిఫికేషన్‌ అవుతుంది. ఇది మా వర్క్‌ కల్చర్‌ అని చెప్పారు. బీబీ నగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ భవనం పనులు చాలా తొందరగా పూర్తవుతున్నాయని.. ప్రజలంతా మేము చేసిన పనులను చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు.

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

నేడు తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణలో 20 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను మోదీ జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్‌-సిద్దిపేట రైల్వేలైన్‌, సిద్దిపేట-సికింద్రాబాద్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఎన్డీఏలో చేరతానని సీఎం కేసీఆర్‌ వెంటపడ్డారు.. కానీ ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీసంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి కలిశారు. తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని కేసీఆర్‌ చెప్పారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్‌ కోరారు. ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యమని కేసీఆర్‌తో చెప్పా. మీరేమైనా రాజులా అని నేను ప్రశ్నించా. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పా. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్‌కు తేల్చి చెప్పా. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్ భయపడుతున్నాడు’’ అని మోదీ హెచ్చరించారు..

 

అవసరం తీరాక కేసీఆర్ ప్రవర్తన మారింది..

కేసీఆర్ గతంలో హైదరాబాద్ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ఉన్నాడు. ఆర్భాటంగా స్వాగతం పలికాడని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఇప్పుడేమైంది? మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయింది. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదు. తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటోంది. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణసాకారమైంది. తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడింది. కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగింది. కేసీఆర్‌, ఆయన కుమారుడు… ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్ఎస్  దొచుకుంటోంది. కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదు. నమ్మకం ఉంచి టి.బీజేపీకి అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ దోచుకున్నదంతా కక్కిస్తా’’ అని మోదీ పేర్కొన్నారు.

వాళ్లిద్దరూ తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారు..

తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉంది. కరోనాకు మందు కనిపెట్టారని మోదీ చెప్పారు. ‘‘నిజాం నవాబులు హైదరాబాద్‌ను వదలకపోతే ఒకే ఒక్క గుజరాతీ బిడ్డ వల్లబాభాయ్ పటేల్ వారిని తరిమేశారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన అవసరం లేదు. వేలాది మంది బలిదానం చేసి సాధించిన రాష్ట్రాన్ని ఒకే కుటుంబం కబ్జా చేసింది. ఇక్కడి ప్రజల కలలను తుంచేశారు. కాంగ్రెస్ వారితో కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌తో సంబంధం ఉంది. వాళ్లిద్దరు తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌(Congress, BRS)కు ఇలాగే చీకటి ఒప్పందాలు జరిగాయి. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణకే వినియోగిస్తున్నారు. రైల్వే, ఆరోగ్య పథకాలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశాం. నిజామాబాద్ మహిళలు, రైతులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన అపురూప స్వాగతంతో ధన్యుడిని. ఈ ఎన్నికల్లో నారీ శక్తి చూపించాలి. మీ ఓట్ల బలంతో వాళ్లు బలవంతులు అయ్యారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మందిరాలపై ప్రభుత్వ పెత్తనం

మందిరాలపై ప్రభుత్వ పెత్తనం సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘మందిరాల స్థలాలు కబ్జా చేస్తున్నారు.. ఆస్తులు లాక్కుంటున్నారు.కానీ, మైనార్టీ ప్రార్థన మందిరాలపై ఇలాంటి చర్యలు తీసుకోగలరా..? హిందు మందిరాలను నడిపించే హక్కు హిందువులకే ఇవ్వగలరా..?పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశ ప్రగతిని ఎవరూ ఆపలేరు. ఇదే నా లక్ష్యం. తెలంగాణలో మరో ఐదేళ్లు దోపిడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు. మా వాళ్లను గెలిపించండి.. మీ పాదాల దగ్గర ఉంచుతా. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తాం’’ అని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.