ప్రిగోజిన్‌ శరీరంలో గ్రనేడ్‌ అవశేషాలు

 ప్రిగోజిన్‌ శరీరంలో గ్రనేడ్‌ అవశేషాలు..    - వాగ్నర్‌ చీఫ్‌ మృతిపై తొలిసారి స్పందించిన పుతిన్‌

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: ప్రిగోజిన్‌ మృతిపై పుతిన్‌ తాజాగా తొలిసారి స్పందించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంపై బయటి నుంచి ఎలాంటి దాడీ జరగలేదని స్పష్టం చేశారు. ప్రిగోజిన్‌తో పాటు ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి శరీరాల్లో గ్రనేడ్ అవశేషాలను గుర్తించినట్లు చెప్పారు. దీంతో వారు ప్రయాణిస్తున్న విమానంలో గ్రనేడ్ పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. రష్యా పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ ఇటీవలే విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. మాస్కో నుంచి సెయింట్‌ పీట్స్‌బర్గ్‌ వెళుతున్న ఒక ప్రైవేట్‌ విమానం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్‌ రీజియన్‌లో కూలిపోయింది. ప్రమాదంలో ప్రిగోజిన్‌ సహా 10 మంది మరణించారు. అయితే, వాగ్నర్‌ చీఫ్‌ మరణం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందని పలువురు అనుమానాలూ వ్యక్తం చేశారు. పుతిన్‌పై తిరగబడినందుకే ఆయన్ని అంతమొందించారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఇటీవలే జరిగిన వార్షిక సమావేశంలో పుతిన్‌ మాట్లాడుతూ.. ‘ప్రిగోజిన్‌ ప్రయాణిస్తున్న విమానంపై బయట నుంచి ఎలాంటి దాడీ జరగలేదు. విమాన ప్రమాదానికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ కమిటీ కొన్ని రోజుల క్రితం నాకు నివేదిక అందించింది. అందులో మృతి చెందిన వారి శరీరాల్లో హ్యాండ్ గ్రనేడ్ల శకలాలు కనుగొనబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే విమానంలో గ్రనేడ్‌ పేలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉండొచ్చు’ అని పుతిన్‌ పేర్కొన్నారు.ప్రిగోజిన్ తన జీవితంలో ఎన్నో తీవ్రమైన తప్పులు చేశాడని పుతిన్‌ వ్యాఖ్యానించారు. అయితే, అతడు తప్పులు చేసినప్పటికీ సరైన ఫలితాలను రాబట్టాడని మెచ్చుకున్నారు. ఇక ఇదే సందర్భంగా విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్న అధికారులపై పుతిన్ విమర్శలు గుప్పించారు. ప్రిగోజిన్ సహా ఇతరుల శరీరాలకు ఆల్కహాల్, డ్రగ్ టెస్టులు జరపకపోవడాన్ని తప్పుబట్టారు.

Leave A Reply

Your email address will not be published.