అంతరిక్షంలోకి మానవులను పంపనున్న ఇస్రో
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చంద్రయాన్ 3 విజయంతో మరిన్ని కీలక ప్రయోగాలకు ఇస్రో శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టనుంది. గగన్యాన్ పేరుతో నింగిలోకి దూసుకెళ్లనున్న ఈ రాకెట్ కోసం ఇప్పటికే ఇస్రో అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే ఈ గగన్యాన్ ప్రయోగంలోనే అత్యంత కీలకమైన క్రూ మాడ్యూల్ను ఇస్రో పరీక్షించనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అక్టోబర్ 21 వ తేదీన ఈ క్రూ మాడ్యూల్ టెస్ట్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది గగన్యాన్ తొలి టెస్ట్ ఫ్లైట్ అని జితేంద్ర సింగ్ చెప్పారు.ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ క్రూ మాడ్యూల్ టెస్ట్ను చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఉండడానికి ఉండే క్రూ మాడ్యూల్ను ఈ టెస్ట్ ఫ్లైట్లో భాగంగా పరీక్షించనున్నారు. ఈ క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి పంపడం.. ఆ తర్వాత సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సంబంధించి టెస్ట్ చేయనున్నారు. అయితే ఈ క్రూ మాడ్యూల్ను స్పేస్లోకి పంపించి అక్కడి నుంచి బంగాళాఖాతంలో దిగిన తర్వాత దాన్ని రికవరీ చేయడాన్ని పరీక్షించనున్నారు. ఇప్పటికే గగన్యాన్ టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-1 టీవీ-డీ1 మాడ్యూల్ను లాంచింగ్ కాంప్లెక్స్కు చేరుకుంది.పీడనం లేని క్రూ మాడ్యూల్లో వ్యోమగాములను నింగిలోకి పంపించనున్నారు. అయితే ప్రస్తుతం చేయనున్న పరీక్షల్లో ఈ క్రూ మాడ్యూల్ను అంతరిక్షంలోకి సురక్షితంగా పంపి.. అక్కడి నుంచి సేఫ్గా బంగాళాఖాతంలో ల్యాండ్ చేయనున్నారు. అక్కడి నుంచి ఇండియన్ నేవీ ఆ మాడ్యూల్ మిషన్ను తీసుకురానున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ టెస్ట్ వెహికల్ అనేది అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన సింగిల్ ఫేజ్ లిక్విడ్ రాకెట్. పేలోడ్లలో క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్లతోపాటు క్రూ మాడ్యూల్ ఫెయిరింగ్, ఇంటర్ఫేస్ అడాప్టర్లు ఉంటాయి. ఈ గగన్యాన్లో మిషన్లోని మరో కీలక టెస్ట్ను ఈ ఏప్రిల్లో పూర్తి చేశారు. ముగ్గురు వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్ భూమి చుట్టూ 400 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి వెళ్లనుంది. ఆ తర్వాత బంగాళాఖాతంలో నిర్దేశించిన ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసిన తర్వాత అందులోని వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకురానున్నారు.ఈ గగన్యాన్ మిషన్లో భాగంగా ఒక మహిళా రోబోను నింగిలోకి ఇస్రో పంపించనుందని.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలోనే వివరించారు. ఆ మహిళా రోబో పేరు వ్యోమమిత్ర అని కూడా వెల్లడించారు. అయితే ఈ గగన్యాన్ ప్రయోగాన్ని 2022 లోనే స్పేస్లోకి పంపించాల్సి ఉన్నా.. కొవిడ్ కారణంగా ఆలస్యం అయినట్లు తెలిపారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడం ఎంత ముఖ్యమో.. అంతే సురక్షితంగా వారిని తిరిగి మళ్లీ భూమిపైకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమని జితేంద్ర సింగ్ తెలిపారు. ఇక వ్యోమమిత్ర అనే మహిళా రోబో.. మనిషి చేసే అన్ని పనులను చేస్తుందని చెప్పారు.