న్యూస్క్లిక్ కేసులో ఢిల్లీ పోలీసులకు ‘సుప్రీం’ నోటీసులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్ట్ గురువారం నోటీసులు జారీ చేసింది. ఉపా కేసులో అరెస్టయిన న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. పురకాయస్థ, అమిత్ చక్రవర్తి తరఫు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, దేవదత్ కామత్ సుప్రీంకోర్టుల పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు జైలులో ఉన్నారని, సత్వరమే పిటిషన్పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు.పిటిషన్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 30లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు పోలీసులకు జారీ నోటీసుల్లో ఆదేశించింది. కోర్టు ఇంతకుముందు కేసును 16న విచారించేందుకు అంగీకరించింది. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ నమోదు చేసిన ఉపా కేసులో అరెస్ట్, రిమాండ్ సవాల్ చేస్తూ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యూస్క్లిక్ ఓ డిజిటల్ మీడియా ప్లాట్ఫారమ్. విదేశీ నిధుల నిధుల వ్యవహారంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.