మైనర్ రేప్ కేసులో యువకుడిని నిర్దోషిగా ప్రకటించిన కల్కత్తా హైకోర్టు
- కౌమారదశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి - అమ్మాయిల శరీర సౌష్టవాన్ని గౌరవించాలి - అబ్బాయిలు కూడా అమ్మాయిలు, మహిళల పట్ల హుందాగా వ్యవహరించాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రెండు నిమిషాల సుఖానికి ప్రాధాన్యం ఇవ్వడం కన్నా.. కౌమారదశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని కల్కత్తా హైకోర్టు తెలిపింది. కౌమారదశలో ఉన్న అబ్బాయిలు కూడా అమ్మాయిలు, మహిళల పట్ల హుందాగా వ్యవహరించాలని, వారి శరీర సౌష్టవాన్ని గౌరవించాలని హైకోర్టు అభిప్రాయపడింది. మైనర్ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఓ యువకుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. జస్టిస్ చిట్టా రంజన్ దాస్, పార్దసారధి సేన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.16 ఏళ్లు దాటిన అమ్మాయిలు, అబ్బాయిలు ఒకవేళ ఇష్టపూర్వకంగా లైంగిక చర్యలో పాల్గొంటే ఆ కేసులను నేరరహితం చేయాలని కోర్టు తెలిపింది. యవ్వన దశలో లైంగిక సంబంధాల ద్వారా కలిగే న్యాయపరమైన చిక్కులపై అవగాహన కల్పించేందుకు సమగ్రమైన లైంగిక విద్యను అందించాలని కోర్టు అభిప్రాయపడింది. లైంగికపరమైన కోర్కెలు, వాంఛాలకు చెందిన కారణాలను కోర్టు తన తీర్పులో సవివరంగా వెల్లడించింది.లైంగిక వాంఛలు కలడానికి మన శరీరంలోని పిట్యుటరీ గ్రంధి కీలకమైందని, అది టెస్టెస్టరోన్ లాంటి లైంగిక హార్మోన్లను రిలీజ్ చేస్తుందని, ఆ గ్రంధిని అదుపులో పెట్టడం మన చేతుల్లో ఉందని, ఆ గ్రంధి ఆటోమెటిక్గా హార్మోన్లను రిలీజ్ చేయదు అని, చూడడం, వినడం, చదవడం వంటి చర్యలతో మనలో లైంగిక తృష్ణ కలుగుతుందని కోర్టు తెలిపింది. అంటే మన స్వంత చర్యల వల్లే మనలో కోర్కెలు కలుగుతున్నాయని, అందుకే ఆ కోర్కెలను అదుపులో పెట్టుకోవాలని కోల్కతా హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. యవ్వన దశలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉండాలన్న సూత్రాలను కూడా కోర్టు తన తీర్పులో వెల్లడించింది.