శివసేన యూబీటీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు
కాషాయ పార్టీని ఆయన ఉగ్ర సంస్ధ హమాస్తో పోల్చిన ఎంపీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శివసేన యూబీటీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీని ఆయన ఉగ్ర సంస్ధ హమాస్తో పోల్చడం దుమారం రేపింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇజ్రాయెల్-హమాస్ వివాదం గురించి చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందనకు కౌంటర్ ఇస్తూ రౌత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసోం సీఎం హిమంత శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ హమాస్ కంటే తక్కువేమీ కాదని, కాషాయ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి విపక్షాన్ని నిర్వీర్యం చేస్తోందని సంజయ్ రౌత్ మండిపడ్డారు.శర్మ ముందుగా చరిత్రను చదివి అర్ధం చేసుకోవాలని హితవు పలికారు. అసోం సీఎం బీజేపీకి చెందిన నేతని, ఆయన ముందుగా పాలస్తీనా-ఇజ్రాయెల్పై మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి వైఖరి గురించి తెలుసుకోవాలని అన్నారు. కాగా, అంతకుముందు శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియా సూలేపై హిమంత శర్మ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.శరద్ పవార్ తన కూతురు సుప్రియా సూలేను హమాస్ తరపున పోరాడేందుకు గాజా పంపుతారని తాను అనుకుంటున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసేముందు శరద్ పవార్ ప్రసంగాన్ని బీజేపీ శ్రద్ధగా వినాలని శర్మ వ్యాఖ్యలపై స్పందిస్తూ సుప్రియా సూలే పేర్కొన్నారు. హిమంత శర్మ, తాను ఒకే డీఎన్ఏ కలిగి ఉన్నామని, ఇద్దరూ కాంగ్రెస్లో పనిచేశామని ఆమె గుర్తుచేశారు. బీజేపీ మహిళలను ఎలా అవమానిస్తుందో తెలిసినా, హిమంత శర్మపై తనకు ఆశలుండేవని, కానీ కాషాయ పార్టీలో చేరగానే ఆయన పూర్తిగా మారిపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.